Sunday, March 24, 2024
మన యూట్యూబ్ ఛానెల్ ను ఆదరించండి....
Friday, February 9, 2024
టైసన్ కుమార్ శర్మ-గడ్డం-ఇంస్టా కథా కమామీషు!
కూరగాయలు ఎప్పుడూ ఒకరి దగ్గరే కొనడం.
కిరాణా సరుకులు ఒకే దుకాణం నుంచి తేవడం.
షూ పాలిషింగ్ కు ఒక వ్యక్తి దగ్గరికే వెళ్లడం.
కటింగ్ ఒక సెలూన్ లోనే, ఒకే వ్యక్తితో చేయించుకోవడం.
--ఇలాంటి పనులన్నీ సరదా కలిగించేవి. ఖైరతాబాద్ చౌరస్తా మూలలో రోడ్డు మీద చిన్నచెప్పుల దుకాణం నడిపిన అయన దగ్గరకు 20 ఏళ్లకు పైగా వెళ్ళాను. చెప్పులు/షూ తీసుకుపోవడం... ఇరిగిపోయిన స్టూల్ మీద కూర్చొని ఆయన పనిలో నిమగ్నమై చేస్తుండగానే మంచీ చెడూ, వర్తమాన రాజకీయ సామాజిక అంశాలు మాట్లాడడం... పిల్లల గురించి అడగడం... అయిన దానికన్నా కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇవ్వడం... తాగుడు మంచిది కాదని చెప్పడం-ఇదీ తంతు. నెలలో ఒకటి రెండు సార్లు ఇది జరిగేది. ఒక గంట ఈ పనికి పోయినా ఆయన దగ్గరికే వెళ్ళే కబుర్లాడితే అదో తృప్తిగా అనిపించేది. కానీ, ఆయన కనిపించకపోయేసరికి ఏదో వెలితి, ఏదో కోల్పోయిన భావన. కేపీహెచ్బీ కి ఒక మూడేళ్ళ కిందట మారినా ఖైరతాబాద్ వెళ్ళినప్పుడల్లా అయన కనిపిస్తాడేమోనని షాపులో తొంగి చూసి భంగపడ్డా, బాధపడ్డా. వాళ్ళ అబ్బాయి విద్యుత్ శాఖలో పనిచేస్తాడని తెలిసి అక్కడికి వెళ్లాలని, మనోడి గురించి వాకబు చేయాలని అనుకున్నా కానీ కుదరలేదు.
కేపీహెచ్బీ లో షూ పాలిషింగ్ కు ఒకాయనను పట్టాను. అయన దగ్గర కూర్చుని ఖైరతాబాద్ మిత్రుడి గురించి చాలా ఆవేదనతో చెప్పాను ఒక రెండు నెల్ల కిందట. ఆశ్చర్య పోవడం అయన వంతయ్యింది. నేను చెప్పిన గుర్తులు విన్నాక--'సార్... మా కాకా మీకు తెలుసా? నాకు వరసకు బాబాయి. మొన్ననే కాలం చేశాడు,' అని కేపీహెచ్బీ మిత్రుడు చెబితే చాలా బాధేసింది. అయన గురించి మేము చాలా సేపు మాట్లాడుకున్నాం. అప్పట్లో ఆయనా, నేను ఖైరతాబాద్ షాపు దగ్గర ఎన్ని విషయాలు మాట్లాడుకున్నామో... అన్నీ గిర్రున బుర్రలో తిరిగాయి. మంచి శ్రమ జీవి. ఎక్కువ హిందీలో మాట్లాడేవాడు. పాపం తాగుడు దెబ్బతీసిందేమో? అని నేను కేపీహెచ్బీ మిత్రుడితో అన్నాను. 'సార్, అదే పెద్ద తప్పయింది. తాగినన్ని రోజులు మా కాకా కు ఏమీ గాలే! మస్తుగ ఉండే. రెండేళ్ల కిందట తాగుడు ఆపిండు. రెండు నెల్లకే కలిసిపోయిండు," అని చావు కబురు చెప్పాడు. నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. మనసులోనే ఆయనకు నివాళి అర్పించి కకావికలమైన మనసుతో ఇంటికి వచ్చా. బక్క పలచటి వ్యక్తి. అయన చెప్పులు కుట్టడం గానీ, పాలిష్ చేయడం గానీ దగ్గరుండి చూస్తుంటే ఒక కళాకారుడు చిత్రం వేసినట్లే ఉండేది. ఎంతో శ్రద్ధతో, ఏకాగ్రతతో ఆ పనిచేసి మన చెప్పులు/ షూ మనకు ఇస్తున్నప్పుడు ఆ కళ్ళలో ఒక మెరుపు ఉండేది. 'భాయ్... బహుత్ అఛ్ఛా కామ్ కియా ఆప్. ఫిర్ మిలేంగే,' అని చెప్పి ఇరవయ్యో, ముప్పయ్యో ఎక్కువ ఇస్తుంటే ఆ కళ్ళతో ఒక గర్వం ఉండేది. మన పనితనం వల్లనే కదా... ఈ సారు ఎప్పుడూ వచ్చేది, అయిన దానికన్నా ఎక్కువ ఇచ్చేది... అన్న ఫీలింగ్ కనిపించేది. పాపం, తాగుడు ఆపి తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళాడు నా పాత మిత్రుడు. మరణానికి కారణమైన వాస్తవం ఇదై ఉండదు కానీ ప్రస్తుతానికి ఈ కుటుంబం నమ్ముతున్నట్లు మనమూ నమ్మడమే. ఐ మిస్ యూ, భాయ్.
ఇంకా నేను నయం, నా ప్రియ మిత్రుడు రమేష్ (ఖమ్మం మెడికల్ శాఖ) గడిచి 30 ఏళ్ల కు పైగా ఒకే బార్బర్ దగ్గరకు వెళ్తున్నాడు. బార్బర్ అనే మాట వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని దూరం చేస్తుంది కాబట్టి ఆ మాటను విరమించుకోవడం సబబు. కొత్తగూడెం లో మాకు డిగ్రీలో కటింగ్ చేసిన రామకృష్ణ దగ్గర తప్ప మా వాడు ఎక్కడా చేయించడు. వాడికి వేరే ఊరికి బదిలీ అయినా వందో, రెండొందలో బస్సుకు పెట్టి వెళ్ళి మరీ రామకృష్ణ దగ్గర కటింగ్ చేయించుకుంటాడు. ఈ మధ్య నేను కొత్తగూడెం మీదుగా వెళ్తుంటే నన్ను కూడా ఆపి రామకృష్ణ దగ్గరకు తీసుకుపోయి పాత దోస్తానా ను పునః స్థాపించాడు. రమేష్, రఫీ, నేను-ముగ్గురం ఈ పాత మిత్రుల గురించి, వాళ్ళ బాగోగుల గురించి లోతుగా తన్మయత్వంతో చర్చించుకుంటాం. వాళ్లకు మనమేమి చేయగలమా? అని ఆలోచిస్తాం. అదో తృప్తి! మా ఊళ్ళో గంప తో తెచ్చి కూరలు అమ్మిన ఆమె చెప్పిన కబుర్లు, నా బాపతు అయిన నా భార్య నల్గొండలో తాను తరచూ వెళ్లే ఆకుకూరల ఆమె కూతురు పెళ్లికి డబ్బులు సర్దిన విషయం గుర్తుకు వచ్చాయి.
కేపీహెచ్బీ లో మూడేళ్ళ కిందట సెలూన్ లో ఒక ఉత్తరాది యువకుడు ఇట్లనే పరిచయం అయ్యాడు. పేరు-టైసన్ కుమార్ శర్మ అని చెప్పాడు. క్రీడలపై ఆసక్తి ఉన్న నేను అడిగాను-"మీ నాన్న గారు బాక్సర్ టైసన్ అభిమానా?"
"నహీ సార్. మేరా అస్లీ నామ్ హై గుడ్డూ శర్మ. తెల్గు మీ 'గుడ్డు' బోలెతో ఎగ్ హైనా. ఇదర్ అనేకే బాద్ పతా చాలా. ఇసీలియే మై నామ్ చేంజ్ కియా," అని తన పేరు వెనక మతలబు చెప్పాడు, అమాయకంగా ఇకిలిస్తూ. 23 ఏళ్ల పిల్లవాడు. ఒక సంక్రాంతి పండగ రోజు అరిసెలు తీసుకెళ్లి ఇస్తే భలే ఆనందించాడు. ఇంకో సారి టీ షర్ట్ లు (పాతవే కానీ మంచివి) తీసుకెళ్లి ఇచ్చా. ఐదారు తీసుకెళ్తే రెండు చాలని తీసుకున్నాడు.
ఈ గుడ్డూ శర్మ అలియాస్ టైసన్ కుమార్ శర్మ నిన్న రాత్రి నా గడ్డం ట్రిమ్ చేసి ఇంస్టా గ్రామ్ లో పెట్టుకుంటానని చెప్పి తీసుకున్న ఫోటో ఇది. రాత్రి తొమ్మిది గంటలకు షాపు మూసే సమయం లో సైతం శ్రద్దగా గడ్డం చేసి, ఫోటో తీసి, అప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెట్టాడు. ఇలాంటి ఆత్మీయులకు మనం ఎంత చేసినా తక్కువే కదా! ఇలాంటి వాళ్లు-మనకు ఆత్మబంధువులు.
Saturday, October 22, 2022
మునుగోడులో 5 W, 1 H లెక్కే వేరు షా...మీ!
మిత్రులారా... నమస్తే,
నేను ఈ నెల 8 వ తేదీ నుంచి 'ఆరామ్ సే' పేరులో వర్తమాన రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, క్రీడాంశాలపై క్విక్ ఎడిట్స్ శీర్షికన కామెంటరీ రాస్తున్నాను. ఒక నిమిషంలో చదివేలా సంక్షిప్తంగా, సూటిగా, నిష్పాక్షికంగా ఉండడం దాని ప్రత్యేకత.
సోషల్ మీడియాను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రయోగం ఇది. ఇకపై వాటిని మీతో ఈ బ్లాగ్ లో కూడా పంచుకుంటాను.
రాము
Saturday, October 1, 2022
ఇప్పుడు మీడియా లేదు, ఉన్నది మాఫియానే: 'వీక్షణం' ఎడిటర్ ఎన్.వేణుగోపాల్
కత్తి అంచున ఉన్న దేశ ప్రజలలో ప్రగతిశీల విశాల భావజాలాన్నినింపేందుకు, సామాజిక చైతన్యం తెచ్చేందుకు పత్రికలు ప్రయత్నించాలని గత రెండు దశాబ్దాలుగా తెలుగులో ప్రత్యామ్నాయ మీడియాగా ప్రఖ్యాతి పొందిన 'వీక్షణం' పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అన్నారు.
మార్క్సిస్టు భావజాల వ్యాప్తి ధ్యేయంగా పెట్టుకున్న 'దారిదీపం' మాసపత్రికను శనివారం (అక్టోబర్ 1, 2022) సాయంత్రం జూమ్ సమావేశంలో వేణుగోపాల్ ఆవిష్కరించి ప్రసంగించారు. 'పత్రికలు-సామాజిక చైతన్యం' అనే అంశంపై అయన మాట్లాడుతూ ఈ శీర్షికలో ఉన్న రెండు పదాలూ (పత్రికలూ, సామాజిక చైతన్యం) దుష్ట సమాసంగా, విరోధ భాసలా ఇప్పుడున్నాయని అయనఆవేదన వెలిబుచ్చారు. ఇప్పుడు మీడియా లేదు, ఉన్నది మాఫియానే అని స్పష్టం చేశారు.
1984లో తను జర్నలిజం లోకి అడుగుపెట్టినప్పుడు 'ఆబ్జెక్టివ్ న్యూట్రాలిటీ' ముఖ్యమని జర్నలిజం మొదటి క్లాసులో హితవుగా చెప్పేవారని, ఇప్పుడు అది ఆవిరైపోయింది వేణుగోపాల్ చెప్పారు. వార్త లో ఉండాల్సిన 5 డబ్ల్యూ, 1 హెచ్ సూత్రంలో ముఖ్యమైన 'ఎందుకు' అన్న ప్రశ్నకు తావులేకుండా పత్రికలు వార్తలు నింపుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. 1955 ఉప ఎన్నికల్లో రెండు ప్రధాన తెలుగు పత్రికల వైఖరి చూసి 'పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు-పత్రికలు' అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన విషయాన్ని అయన గుర్తుచేశారు. 1960 నుంచి 80 వరకూ సామాజిక చైతన్యం కొద్దోగొప్పో ఉన్నా, 1990 నుంచి మూడు దశాబ్దాలుగా తిరోగమన పథంలో పత్రికలు పయనిస్తున్నాయని చెప్పారు.
ప్రపంచీకరణ తర్వాత తిరోగమనంలో పత్రికల ప్రయాణం సాగుతున్నదని, ప్రగతిశీలభావాలు ఉండడం చాదస్తం గా పరిగణింపబడుతున్నదని చెప్పారు. 'న్యూస్ పేపర్ ఈజ్ ఏ ప్రోడక్ట్, నాట్ ఏ సోషల్ సర్వీస్' అని వక్కాణించిన తాను పనిచేసిన పత్రిక యజమాని మాటలు ఉటంకిస్తూ-రెండు రాష్ట్రాల్లో తెలుగు పత్రికల ధోరణులను ప్రస్తావించారు. "ఏదైనా ఒక పత్రిక చదివితే వాస్తవం తెలియదు. ప్రతి ఒక్కరు రెండో మూడో పత్రికలు చదివి బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకోవాలి. ఇందువల్ల కొందరు పత్రికలు చదవడం మానేశారు," అని వేణుగోపాల్ చెప్పారు. ఆ తర్వాత వచ్చిన టెలివిజన్ ఒక 'మాదక ద్రవ్యం' అనీ, తర్వాత విజృంభించిన సాంకేతిక పరిజ్ఞానం మేలు-కీడుల కలయిక అన్నారు. "టెక్నాలజీ వచ్చి రచనను ప్రజాస్వామీకరించి మేలు చేసింది. కానీ అనియంత్రింత వ్యక్తీకరణ వల్ల కీడు జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు వెబ్ లో అబద్ధాలపై బాగా వెచ్చిస్తూ పెద్ద పెద్ద కార్యాలయాలను నెలకొల్పడంతో మహా సముద్రంలో గుక్కెడు మంచినీళ్లు దొరకని నావికుడికిలా పాఠకుడయ్యారని అభిప్రాయపడ్డారు. ఈ నిరంతర వార్తా స్రవంతిలో మొత్తం మురికినీరేనన్నారు.
రెండు దశాబ్దాలుగా తాము ఎన్నో ఒడిదొడుకుల మధ్య నిర్వహిస్తున్న 'వీక్షణం' పత్రికకు ఉన్న మూడు లక్ష్యాలను (1. ప్రధాన వార్తా స్రవంతి లో వస్తున్న వార్తల వెనుక ప్రజా కోణాలు ప్రస్తావించడం 2. ప్రచార సాధనాల మౌనం వహిస్తున్న, విస్మరిస్తున్న ప్రజాకోణాలు చర్చించడం 3) సామాజిక ఘటనలను అర్థం చేసుకోనేలా ప్రజలకు దృక్పథం ఇవ్వడం) వివరించారు. “A good newspaper is a nation talking to itself” అన్న Arthur Miller ను కోట్ చేస్తూ- తప్పుడు చైతన్యాన్ని ప్రతిఘటించడం ఎలా? అన్నది సత్యానంతర యుగంలో పెద్ద సవాలన్నారు.
యాజమాన్యపు కేంద్రీకరణ దుష్ప్రభావాన్ని వివరిస్తూ--90 శాతం మీడియా కేవలంనలుగురు ధనిక పారిశ్రామికవేత్తల చేతిలో ఉందని వేణుగోపాల్ చెప్పారు. విష విద్వేష భావజాలాన్ని పెంచుతున్న, పంచుతున్న సంఘ్ పరివార్ కమ్మేస్తున్న కారుచీకటిలో 'దారిదీపం' వెలుగు దివ్వె కావాలన్న అభిలాషను వెలిబుచ్చారు.
Karl Marx ఫ్రీ ప్రెస్ గురించి చెప్పిన ఈ కింది ఒక మంచి మాటతో వేణుగోపాల్ ప్రసంగం ముగిసింది.
‘‘The free Press is the ubiquitous vigilant eye of a people’s soul, the embodiment of a people’s faith in itself, the eloquent link that connects the individual with the State and the world, the embodied culture that transforms material struggles into intellectual struggles and idealises their crude material form. It is a people’s frank confession to itself… It is the spiritual mirror in which a people can see itself… It is the spirit of the State, which can be delivered into every cottage, cheaper than coal gas. It is all-sided, ubiquitous, omniscient.”
విశాలాంధ్ర ఎడిటర్, ఆర్వీ రామారావు మాట్లాడుతూ సమాచారానికి, వ్యాఖ్యకు మధ్య రేఖ చెరిగిపోయింది చెప్పారు. గతంలో 'జాతీయ స్ఫూర్తి' అనే పత్రికను విజయవంతంగా నడిపి, ఇప్పుడు 'దారిదీపం' సంపాదకుడిగా ఉన్న డీవీవీఎస్ వర్మ ప్రసంగించారు.