Friday, July 25, 2014

ఘనంగా తెలుగు, ఉర్దూ జర్నలిస్టుల వర్క్ షాప్

మన దగ్గర జర్నలిజంలో పెద్ద లోటు ఏమిటయా అంటే... వృత్తిలో చేరిన వారి ప్రతిభ మెరుగు పెట్టుకోవడానికి కాలక్రమేణా వర్క్ షాపులు, రిఫ్రెష్ మెంట్ కోర్సులు లేకపోవడం. అకడమిక్స్ కు ఇండస్ట్రీ కి మధ్య సరైన వారధి లేకపోవడం. ఒక సారి వృత్తిలో చేరిన వారిలో చాలా మంది... విజ్ఞానంతోనో-అజ్ఞానంతోనో, కష్టపడో-కనికట్టుచేసో పనిచేస్తూ, బై లైన్లు చూసుకుని మురుస్తూ వృత్తి తెచ్చిన అహంకారంతో మెలుగుతూ, ఉద్యోగం కాపాడుకుంటూ బతికేస్తారు. వృత్తి నైపుణ్యం మెరుగు పరుచుకునే, కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం అటు యాజమాన్యాలు ఇవ్వవు, ఇటు వీళ్ళకు ఆ పనిచేసే సాధన సంపత్తి గానీ, తీరికా ఓపికా గానీ ఉండవు. ఒక ఇరవై ఏళ్ళు తెలుగు, ఇంగ్లీష్ జర్నలిస్టుగా, మరొక ఐదేళ్ళు యూనివర్సిటీ లో జర్నలిజం బోధకుడిగా పనిచేసిన నాకు (ఈ వ్యాసకర్త ఎస్ రాము) ఈ వెలితి ఎక్కువగా అనిపించేది. 

ఈ పరిస్థితిలో నాకు ఒక రెండు మూడు నెలల కిందట.. వాషింగ్టన్ కేంద్రంగా గత ముప్ఫై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిస్ట్స్ (ఐ సీ ఎఫ్ జే) అనే సంస్థ నుంచి ఒక మెయిల్ వచ్చింది. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ ఫండింగ్ తో హైదరాబాద్ లో తెలుగు, ఉర్దూ జర్నలిస్టుల కోసం ఒక నాలుగు రోజుల పాటు.. నేను ఒక అధికారిగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ (ఆస్కీ) లో వర్క్ షాప్ నిర్వహిద్దామని. ఆ సెంటర్ కు చెందిన జోహనా కొరిల్లొ (అమెరికా లో స్థిరపడిన చిలీ మహిళ), నేను మెయిల్స్, స్కైప్ కాల్స్ తర్వాత ఇక్కడి అమెరికన్ కాన్సులేట్ అధికారుల సూచనలు, సలహాలు, ప్రమేయాలతో... ఒప్పందాలు కుదుర్చుకుని, అజెండా తయారుచేసి ఒక కొలిక్కి తెచ్చాం. "బ్రింగింగ్ ద వరల్డ్ టు ఆన్ ఇండియన్ న్యూస్ ఆడియన్స్" అనే థీమ్ తో... అంతర్జాతీయ వార్తల విషయంలో మన కవరేజ్ అన్న అంశం కేంద్రంగా అజెండా ఉన్నా... ఎథిక్స్ తో సహా జర్నలిజానికి సంబంధించిన అనేక ముఖ్య అంశాలు అందులో చేర్చాం. 
 అనుకున్న ప్రకారం ఆన్ లైన్ లో దరఖాస్తులు అడిగాం. మొత్తం మీద 64 మంది తెలుగు, ఉర్దూ జర్నలిస్టు లు దరఖాస్తు చేయగా... అందులో 30 మందిని కాన్సులేట్ ఎంపిక చేసింది. అందులో 10 టీవీ ప్రతినిధిగా హేమ కూడా నా ప్రమేయం లేకుండా ఎంపిక కావడం నాకు మంచిగా అనిపించింది. తనతో పాటు.. నాకు తెలిసిన అనేక మంది జర్నలిస్టులు కూడా ఎంపికయ్యారు. ఇది రెండు భాషల జర్నలిస్టుల కోసం ఉద్దేశించినప్పటికీ పలువురు ఇంగ్లిష్ జర్నలిస్టులకు కూడా అవకాశం కల్పించారు కాన్సులేట్ వారు. సోమాజిగుడా లో ఉన్న మా ఆస్కీ ఆఫీసులో ఈ కార్యక్రమం ఈ నెల 21 నుంచి 24 వరకు దిగ్విజయంగా జరిగింది. వర్క్ షాప్ నిర్వహణ కోసం.. జొహన్నా తో పాటు ప్రముఖ జర్నలిజం ట్రైనర్ షెర్రీ రిచరార్డి  గత ఆదివారం అమెరికా నుంచి వచ్చారు. ది హిందూ మాజీ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, ప్రముఖ పర్యావరణ జర్నలిస్టు బహర్ దత్, ది హిందూ హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ కె శ్రీనివాస్ రెడ్డి, బిజినెస్ లైన్ బ్యూరో చీఫ్ సోమశేఖర్, ఎం ఎల్ సీ డాక్టర్ కె నాగేశ్వర్, ఆస్కీ ప్రొఫెసర్లు పరమితా దాస్ గుప్తా, వల్లీ మాణిక్యం, గూగుల్ అధికారి శ్రీకాంత్ లతో పాటు పలువురు ఇందులో పాల్గొని ప్రసంగించారు. అమెరికన్ ట్రైనర్ ఆ 30 మంది చేత కొన్ని ఆసక్తికరమైన ఎక్సర్ సైజులు చేయించి...మన్ననలు అందుకున్నారు. 

వర్క్ షాప్ చివరి రోజైన నిన్న (గురువారం), భారత్ లో అమెరికా రాయబారి కెథలీన్ స్టీఫెన్స్ వచ్చి ప్రసంగించారు. దౌత్యవేత్తలు, జర్నలిస్టులు తమ తమ వృత్తుల్లో ఎదుర్కొనే సవాళ్లు, వారి మధ్య ఉండాల్సిన సంబంధాల గురించి ప్రసంగించారు. ఈ సదర్భంగా... ఆస్కీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్ కె రావు గారు ఆమెకు హైదరాబాద్ మీద నరేంద్ర లూథర్ రాసిన పుస్తకాన్ని బహూకరించారు. వర్క్ షాప్ అద్భుతంగా జరిగిందని అందులో పాల్గొన్న జర్నలిస్టులు చెప్పడం ఆనందం కలిగించింది. దీనికైన ఖర్చు భరించిన అమెరికన్ కాన్సులేట్ కు పార్టిసిపెంట్స్ తరఫున కృతఙ్ఞతలు. 

ఫోటో ల వివరణ 
1) వర్క్ షాప్ లో ప్రసంగిస్తున్న అమెరికా రాయబారి 
2) ఆస్కీ లో చిత్రపటాలను తిలకిస్తున్న అమెరికా రాయబారి 
3) అమెరికా రాయబారికి పుస్తకాన్ని బహూకరిస్తున్న ఆస్కీ డైరెక్టర్ జనరల్ 
4) నాలుగు రోజుల వర్క్ షాప్ లో పాల్గొన్న జర్నలిస్టులు 

1 comments:

muralirkishna said...

ayyo nenu miss ayyanu..idi jarigindani mee post chooste tappa teliyaledu..ee sari ilantivi jarigite koncham mail cheyagalru raamu garu ee mail id ki murali202002@gmail.com

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి