Thursday, October 12, 2017

చీఫ్ ఆఫ్ బ్యూరో కోసం 'ది హన్స్ ఇండియా' వెదుకులాట!

హైదరాబాదు కేంద్రంగా ఆనతి కాలంలోనే వినుతికెక్కిన 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల పత్రిక పరిణామాలు ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటాయి. కపిల్ గ్రూప్ మీడియా బాధ్యతలు చూస్తున్నపుడు ప్రసిద్ధ తెలుగు ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి  మస్తిష్కంలో మొగ్గతొడిగిన ఆలోచనే 'ది హన్స్ ఇండియా'. కృష్ణా రామా అంటూ  ఎక్కడో కూర్చున్న  డెక్కన్ క్రానికల్ ఫేమ్ నాయర్ గారిని పూర్ణకుంభ స్వాగతం పలికి మూర్తి గారు పత్రిక ఎడిటర్ బాధ్యతలు అప్పగించారు.

విధివశాత్తూ... మూర్తిగారు అక్కడినుంచి వచ్చేసి సాక్షిలో చేరారు. నాయర్ గారూ నిష్క్రమించారు. ఈ లోపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం బోధకుడిగా, ఎమ్ ఎల్ సి గా ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎడిటర్ గా 'ది హన్స్' పగ్గాలు స్వీకరించారు. ఎడిటోరియల్ పేజీలో సంపాదకీయం కింద తన ఫోటో కూడా వేసుకుని పత్రికకు నూత్న రూపు ఇచ్చి కొత్తపుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తక్కువ ఖర్చుతో కొద్దో గొప్పో నాణ్యతతో వస్తున్న పత్రికల్లో ఒకటిగా నిలుస్తోంది... హన్స్ ఇండియా.

గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా లో పనిచేసిన రామూ శర్మ గారు ఆ పత్రిక చీఫ్ ఆఫ్ బ్యూరో గా ఇంతకాలం పనిచేశారు. వివిధ కారణాల రీత్యా ఆయన ఈ మధ్యన రాజీనామా చేశారట. నోటీసు సర్వ్ చేసి నవంబర్ దాకా ఆయన ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.

రామూ శర్మ గారి స్థానంలో చీఫ్ ఆఫ్ బ్యూరో కోసం ప్రొ. నాగేశ్వర్ బృందం అన్వేషిస్తున్నది. మంచి జర్నలిస్టులు దొరకడం కష్టంగా ఉన్నదని సమాచారం. "నిజంగానే, సరుకున్న  సీనియర్ జర్నలిస్టుల కొరత బాగా ఉంది మన మార్కెట్ లో," అని అక్కడి వారు ఒకరన్నారు.
పైగా ప్రొ. నాగేశ్వర్ ఆలోచనా వేగాన్ని,  ఒత్తిడిని తట్టుకుని నిలబడి...  శక్తి సామర్ధ్యాలు నిరూపించుకునే జర్నలిస్టు ఎవరు దొరుకుతారో వేచి చూడాలి.

హన్స్ ఇండియా సలహాదారు గా ఆ మధ్యన టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ ఎడిటర్ కింగ్ షుక్ నాగ్ చేరారు. ఇది ఆ పత్రికలో కొంత కలకలానికి దారి తీసింది. అయినా... నాగ్ గారు కొన్ని సమావేశాలకు, సూచనలకు పరిమితమవుతున్నారని సమాచారం. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి